ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఆయనని ఐసీయూకి తరలించాయి. అమెరికాకు చెందిన ప్రత్యేక బృందం ఎస్పీబీని పర్యవేక్షించి జాగ్రత్తలు తీసుకోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తిరిగి మెరుగైంది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలు కోవాలని గత వారం రోజులుగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆయన తనయుడు ఎస్పీ చరణ్ మీ అందరి పూజలు ఫలించి నాన్న ఆరోగ్యంగా తిరిగి రావాలని భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో బాలూ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
అయితే తాజాగా నిర్వహించిన టెస్ట్లో బాలుకు నెగెటివ్ వచ్చినట్టు చరణ్ ప్రకటించడంతో బాలు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా వుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలు తనయుడు ఎస్పీ చరణ్ సోమవారం వెల్లడించారు.