వివాదం వుంటే చాలు దాన్ని సినిమాగా చేయాలని దానిపై అందినంతా దండు కోవాలన్నది రామ్గోపాల్ వర్మకు గత కొన్నేళ్లుగా అలవాటుగా మారింది. తాజాగా వర్మ ఓ అమ్మాయి రేప్కు గురై అత్యంత దారుణంగా హత్య చేయబడిన ఉదంతాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు. షాద్నగర్ సమీపంలో టోల్ ప్లాజా వద్ద ఓ నలుగురు రాక్షసుల చేతిలో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై సజీవ దహనం చేయబడిన దిశ ఉదంతం ఆధారంగా వర్మ `దిశ ఎన్కౌంటర్` పేరుతో ఓ సినిమాకి శ్రీకారం చుట్టారు.
ఇటీవల దీనికి సంబంధించిన ట్రైలర్ని ఇటీవలే వర్మ రిలీజ్ చేశాడు. త్వరలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని వెంటనే ఆపేయాలని కోరుతూ దిశ తండ్రి హైకోర్టుని ఆశ్రయించారు. ఈ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెన్సార్ బోర్డుని ఆదేశించాలని రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు. పిటీషన్ని స్వీకరించిన జస్టిస్ పి. నవీన్రావు విచారణ చేపట్టారు.
దిశ ఎన్కౌంటర్ కేసు సుప్రీమ్ కోర్టు ప్రత్యేక కమిటీ విచారణలో వుండగా ఈ సంఘటనపై సినిమా నిర్మించడం కరెక్ట్ కాదని దిశ తండ్రి హైకొర్టుని ఆశ్రయించడం సంచలనంగా మారింది. అయితే `దిశ ఎన్కౌంటర్`పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి దిశ తండ్రి నుంచి ఎలాంటి వినతి పత్రం అందలేదని కేంద్ర ప్రభుత్వం తరుపు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.