కరోనా వైరస్ ఈత రాని వారికి ఈత నేర్పించినట్టు.. గాల్లో ఎగరలేని వాడికి ఎగరడం నేర్పించినట్టుగా చిత్ర విచిత్రాలు చేస్తోంది. వెబ్ సిరీస్లు అంటేనే ఆమడ దూరం వుండే మన కమర్షియల్ డైరెక్టర్స్ ఇప్పుడు కరోనా నేర్పిన పాఠాల కారణంగా వెండితెర తరువాత వెబ్ తెరే ముద్దు అంటూ క్యూ కడుతున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ ఓటీటీ `ఆహా` కోసం క్రిష్ `మస్తీస్` పేరుతో ఓ వెబ్ సిరీస్ని అందిస్తే అది ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ని దాటేసి టీమ్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
దీనికితోడు ఈ ఓటీటీ కోసం సుకుమార్, వేణు ఊడుగుల లాంటి దర్శకులు వెబ్ సిరీస్లు చేయడానికి సిద్ధమవుతుంటే ఇప్పటికే త్రివిక్రమ్ దీని ప్రచారం కోసం అల్లు అర్జున్తో ఓ యాడ్ ఫిల్మ్ని రూపొందించాడు. లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన జనం వినోదం కోసం ఓటీటీలని ఆశ్రయిస్తున్నారు. దీంతో వీటికి భారీ స్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది.
రానున్న రోజుల్లో కూడా దీని ప్రభావం అధికంగా వుండబోతుండటంతో దర్శకులు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి దర్శకుడు తేజ చేరబోతున్నాడు. తేజతో అమెజాన్ ప్రైమ్ ఓ భారీ ఒప్పందాన్ఇ చేసుకోబోతున్నట్టు తెలిసింది. రెండు సినిమాలు, మూడు వెబ్ సిరీస్ల ఒప్పిందం జరగబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం చర్చల దశలో వున్న ఈ డీల్ త్వరలోనే ఓకే అయ్యే అవకాశం వుందని తెలిసింది.