దర్శకుధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, అండ్ ఆయన ఫ్యామిలీ కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన రాజమౌళి కోలుకున్న తరువాత ప్లాస్మా ని తప్పకుండా దానం చేస్తానని మాటిచ్చారు. ఈ విషయం తెలిసి అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. రాజమౌళి, ఆయన ఫ్యామిలీ త్వరగా కోలు కోవాలని ఆకాంక్షించారు.
తాజాగా రాజమౌళి ఫ్యామిలీ కరోనా వైరస్ నుంచి కోలుకుంది. కానీ రాజమౌళి మాత్రం ప్లాస్మా దానం చేయలేదు. కారణం ఏంటో ఈ రోజు ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేసి ప్రాణాలని కాపాడాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. మన శరీరంలో ఏర్పడిన కరోనా ప్రతిబంధకాలు కొన్ని రోజులు మాత్రమే వుంటాయని, ఈలోపే ప్లాస్మా దానం చేస్తే వేరే వారిని కాపాడిన వారమవుతామన్నారు.
తను ప్లాస్మా దానం చేయకపోవడానికి కారణం వివరించారాయన. తన శరీరంలో యాంటీ బాడీస్ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవెల్స్ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15 కంటే ఎక్కువ వుండాలన్నారు. మంగళవారం పెద్దన్న కీరవాణి, కాళభైరవ ప్లాస్మా దానం చేశారని వారికి సంబంధించిన ఫొటోలని షేర్ చేశారు రాజమౌళి.