కేంద్ర ప్రభుత్వం వైరస్ని కట్టడి చేసే ప్రక్రియలో భాగంగా దేశ వ్యాప్తంగా మార్చి నుంచి లాక్డౌన్ని విధించిన విషయం తెలిసిందే. దీని కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఐదు నెలలు గడుస్తున్నా కరోనా అదుపులోకి రాకపోవడంతో కీలక వ్యవస్థలు ఇంకా లాక్డౌన్ పరిథిలోనే వున్నాయి. ఆన్లాక్ ప్రక్రియ మొదలైనా సినీ రంగానికి మాత్రం ఇప్పటికీ వెసులు బాటు లభించడం లేదు. థియేటర్ల రీ ఓపెన్పై కేంద్రం ఇప్పటి వరకు స్పష్టతనివ్వకపోవడంతో సినీ ఇండస్ట్రీలో ఆయోమయ వాతావరణం నెలకొంది.
కొంత మంది ప్రస్తుత పరిస్థితులకు తలొగ్గి రిలీజ్కు సిద్ధంగా వున్న చిత్రాలని ఓటీటీలకి అమ్మేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం పరిస్థితుల్లో మార్పు రాకపోతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న `వి` చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మరికొన్ని చిత్రాలు కూడా ఓటీటీ బాటపడుతున్నాయని, అందులో ధనుష్ నటిస్తున్న `జగమే తంత్రం` కూడా వుందని వార్తలు వినిపిస్తున్నాయి.
వైనాట్ స్టూడియోస్ బ్యానర్పై ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై నిర్మాత శశికాంత్ స్పందించారు. రూమర్స్ని నమ్మకండి.. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్లో చూడాలని టీమ్ అంతా ఓపికగా ఎదురుచూస్తోంది. త్వరలోనే ఆ సమయం వస్తుందని భావిస్తున్నాను` అని నిర్మాత శశికాంత్ ట్వీట్ చేశారు.