కరోనా మహమ్మారి కారణంగా సగటు మనిషి నుంచి సెలబ్రిటీల వరకు అందరి ప్లాన్లు తారుమారయ్యాయి. కరోనాకి ముందు ఓ ప్లాన్ వుంటే కరోనా సమయంలో మరో ప్లాన్కి మారిపోతున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి లైఫ్ని డిజైన్ చేసుకుంటున్నారు. ఇందుకు సినీ స్టార్స్ కూడా మినహాయింపేమీ కాదు. స్టార్స్ కూడా పరస్థితులకి అనుగునంగా ప్రణాళికల్ని మార్చుకుంటున్నారు. థియేటర్లలో రిలీజ్ కావాల్సిన సినిమాలు కరోనా కారణంగా థియేటర్లు రీఓపెన్ కాకపోవడంతో ఓటీటీలో విడుదలవుతున్నాయి.
తాజాగా నాని, సుధీర్ బాబు నటించిన `వి` చిత్రం కేవలం థియేటర్లోనే రిలీజ్ కావాలని భీష్మించుకు కూర్చుంది. కాలం కలిసి రాకపోవడంతో ఫైనల్గా ఓటీటీకే జైకొట్టాల్సి వచ్చింది. తాజాగా మరో భారీ చిత్రం కూడా ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ కాబోతోందంటూ ఇటీవల పోస్టర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మొదలైంది. దీంతో మేకర్స్ దీనిసపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం `మాస్టర్`. `ఖైదీ` ఫేమ్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గ్జావియర్ బ్రిట్టో నిర్మించిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారంటూ వరుస కథనాలు మొదలయ్యాయి.
ఈ వార్తలతో పాటు రిలీజ్ పోస్టర్ని చూసిన మేకర్స్ అవాక్కయ్యారట. `మాస్టర్` చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలో రిలీజ్ చేయడం లేదని, ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరగలేదని చిత్ర బృందం తాజాగా స్పష్టం చేసింది. విజయ్ చిత్రాలు 100 కోట్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం అసాధ్యం అని క్లారిటీ ఇచ్చింది.