![ధనుష్ చిత్రంలో హాలీవుడ్ స్టార్! ధనుష్ చిత్రంలో హాలీవుడ్ స్టార్!](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/02/Hollywood-Star-for-Dhanush-40.jpg)
కొత్త తరహా చిత్రాలతో ఆకట్టుకుంటూ హీరోగా తనదైన ముద్ర వేశారు ధనుష్. ఇటీవల కుల వ్యవస్థ నేపథ్యంలో ఆయన నటించిన `అసురన్` సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ జోష్లో వున్న ధనుష్ వరుసగా రెండు చిత్రాల్ని లైన్లో పెట్టాడు. ముందుగా `పిజ్జా` ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్స్టర్ చిత్రాన్ని చేస్తున్న ఆయన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో `కర్ణన్` పేరుతో ఓ మాస్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇవి రెండు ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
ఈ రెండు చిత్రాల్లో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ `జగమే తందిరం`. ధనుష్ నటిస్తున్న 40వ చిత్రమిది. ఇందులో ధనుష్కు జోడీగా సంచనా నటరాజన్, ఐశ్వర్య లక్ష్మినటిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్పై ఎస్. శశికాంత్ నిర్మిస్తున్నారు. ఇదే చిత్రాన్ని తెలుగులో `జగమే తంత్రం` పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. లండన్లో ఇటీవలే ఓ కీలక షెడ్యూల్ని పూర్తి చేశారు. ఈ చిత్రంలోని ఓ కీలక అతిధి పాత్ర కోసం హాలీవుడ్ స్టార్స్ మోర్గన్ ఫ్రీ మన్, ఆల్ పాచినోలని ట్రై చేసినా ఫలితం దక్కలేదు.
వారిని ఒప్పించి సినిమాపై క్రేజ్ని తీసుకురావాలని కార్తీక్ సుబ్బరాజ్ చాలానే ప్రయత్నాలు చేశారట. చివరికి ఆ స్థానంలో `గేమ్ ఆఫ్ త్రోన్స్, ది క్రానికల్స్ నార్నియా. బ్రేవ్ హార్ట్, బెన్హర్, హైలాండర్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించిన జేమ్స్ కాస్మోస్ని ఫైనల్ చేసుకున్నారట. లండన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి మే 1న రిలీజ్ చేస్తున్నారు.