తలైవా సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన `దర్బార్` ఈ నెల 9న వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. దాదాపు 7000 వేల స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక్క చెన్నైలోనే తొలి రోజు 650 షోస్ పడ్డాయి. సినిమా రిలీజ్కి ఒక్క రోజు ముందే దాదాపు 400 షోలు ఫుల్ అయిపోయినట్టు కోలీవుడ్ కథనం. విడుదలైన తొలి రోజు తొలి షో నుంచి ఈ సినిమా మంచి టాక్ని సొంతం చేసుకుని హౌస్ఫుల్స్ కావడం మేకర్స్తో పాటు రజనీ ఫ్యాన్స్కి ఆనందాన్ని కలిగించింది.
గత కొంత కాలంగా సరైన హిట్ కోసం రజనీ ఎదురుచూస్తున్నారు. అదే తరహాలో రజనీ మార్కు సినిమా కోసం ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు. `దర్బార్`తో ఇద్దరి కోరిక ఒకేసారి నెరవేరడంతో రజనీ ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా లైకా పంస్థ తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్ని నిరుత్సాహపరుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని జైలు సన్నివేశాల్ని, అక్కడ రజనీ చెప్పిన పంచ్ డైలాగ్లని తొలగిస్తున్నట్టు లైకా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జైల్ సన్నివేశాలు శశికలని కించపరిచేలా వున్నాయని, ఆ సన్నివేశాలు పెట్టినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తమిళనాడు ప్రభుత్వానికి చెందిన మత్సశాఖ మంత్రి జయకుమార్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన లైకా ప్రొడక్షన్స్ వారు ఆ సన్నివేశాల్ని తొలగిస్తున్నామంటూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సన్నివేశాలని అడ్డుపెట్టుకుని సినిమాని చెన్నైలో బ్యాన్ చేయించే కుట్ర జరిగే ప్రమాదం వుందని గ్రహించడం వల్లే లైకా ప్రొడక్షన్స్ వర్గాలు తెలివిగా ఆ సీన్లని, డైలాగ్లని తొలగిస్తున్నట్టు ప్రకటించడం బాగుందని తమిళ వర్గాలు అంటున్నాయి.