సూపర్స్టార్ రజనీకాంత్ హిట్ అనే మాట విని చాలా కాలమే అవుతోంది. సెల్యూలార్ సైంటిస్ట్ శంకర్ `రోబో` తరువాత తలైవా ఏకంగా ఏడు చిత్రాల్లో నటించారు. కానీ ఒక్క సినిమా కూడా రజనీ ఫ్యాన్స్ని ఆకట్టుకోలేకపోయింది. రజనీ మార్కు మాస్ ఎంటర్టైనర్ కోసం గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు `దర్బార్` ట్రీట్లా నిలిచింది. దీంతో ఆయన అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. చాలా కాలం తరువాత తాము కోరుకున్న తరహా సినిమాని తలైవా నుంచి రావడంతో ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు.
ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని సూపర్హిట్గా నిలిచింది. దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లని సొంతం చేసుకుంది. తలైవా మళ్లీ విజృంభించాడంటూ ఫ్యాన్స్ `దర్బార్` థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. కొంత మంది ఈ విజాయన్ని తమ విజయంగా భావిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా వుంటే తొలి రోజే రజనీ `దర్బార్`కు పైరసీ దెబ్బ ఎదురైంది. పైరసీ సైట్ల లోకి `దర్బార్` ప్రింట్ వచ్చేయడంతో రజనీ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే పైరసీకి గురికావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.