కరోనా మహమ్మారి ఇండియాని కబళిస్తోంది. దేశంలో వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఇండియా వ్యాప్తంగా ప్రధాన కీలక నగరాల్లో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఏ సిటీని తీసుకున్నా రికార్డు స్థాయి కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రష్యాను అధిగమించి మన దేశం మూడవ స్థానానికి చేరుకుంది. రష్యాలో ఇప్పటి వరకు 6,81, 251 కరోనా కేసులు నమోదు కాగా భారత్లో 6,95, 396 కేసులు నమోదయ్యాయి.
దీంతో అమెరికా, బ్రెజిల్ల తరువాత 3వ స్థానంలో భారత్ నిలిచింది. మరో పక్క రష్యా వ్యాప్తంగా కరోనా బారిన పడి `10,161 మంది చనిపోగా… ఇండియాలో ఇప్పటి వరకు 19, 692 మంది మృత్యువాత పడ్డారు. మన దేశంలో నిత్యం 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపుగా 25 వేల కరోనా కేసులు నమోదయ్యాయని, 613 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది.
భారత్లో నిత్యం కరోనా కేసుల సంఖ్య పెరగడమే కానీ ఎక్కడా తగ్గుముఖం కనిపించడం లేదు. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు కరోనా కేంద్రాలుగా మారాయి. మహారాష్ట్రలో తాజాగా 7 వేలకు పైగా కేసులు నమోదుకాగా తమిళనాడులో 4200కు పైగా, ఢిల్లీలో 2,500 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ దేశాల మాదిరిగానే భారత్ మార్చి నెలాఖరు నుంచి పూర్తి స్థాయి లాక్డౌన్ విధించింది. అన్ని దేశాలకన్నా సమర్థవంతంగా లాక్డౌన్ని అమలు చేసింది. అయితే లాక్డౌన్ సలడలించడం నుంచే భారత్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగించడం మొదలుపెట్టింది. నానాటికీ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే ఢిల్లీలో రెండు వారాల క్రితం 37 శాతం వరకు ఉన్న పాజిటివ్ కేసుల రేటు ఇప్పుడు 10.58 శాతం కి పడిపోవడం ఊరట కలిగిస్తోంది.