కరోనా టీవీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది. మూడున్నర నెలలుగా ఎలాంటి పనిలేక ఇబ్బందులు పడుతున్న టీవీ కళాకారులు ఇప్పటికైనా షూటింగ్లకు అనుమతులు ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం, ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారికి అనుమతులు ఇవ్వడం తెలిసిందే. తీరా అనుమతులు ఇచ్చాక టీవీ ఇండస్ట్రీని కరోనా భయభ్రాంతులకు గురిచేస్తోంది.
టీవీ సీరియల్ షూటింగ్లు స్టార్టయి రెండు వారాలు కూడా పూర్తి కాకముందే టీవీ నటులు వరుసగా కరోనా బారిన పడుతుండటం కలవరానికి గురిచేస్తోంది. ముందు `సూర్యకాంతం` సీరియల్ లో నటిస్తున్న నుటుడు ప్రభాకర్ కరోనా బారిన పడ్డారు. ఆ తరువాత వెంటనే అతనితో కాంటాక్ట్ వున్న కృష్ణ కూ వైరస్ సోకింది. దీంతో కొంత భాయాందోళనకు గురవుతున్న వేళ `ఆమె కథ, నా పేరు మీనాక్షి సీరియల్స్లో నటిస్తున్న నవ్యా స్వామి కరోనా బారిన పడటంతో మరింత కలవరానికి గురిచేసింది.
తాజాగా బిగ్బాస్ ఫేమ్ రవికృష్ణ తనకు కరోనా సోకిందని, స్వీయ నిర్భంధంలోకి వెళ్లానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కరోనా సోకిన వారిని వేరు చేసి చూడకండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ని పెట్టారు. ఇదిలా వుంటే తాజాగా మరో టీవీ సీరియల్ నటుడికి కరోనా సోకినట్టు తెలిసింది. అక్కమొగుడు, నెంబర్ వన్ కోడలు, మౌనరాగం వంటి సీరియల్స్లో నటిస్తున్న శివకు కరోనా సోకింది. దీంతో టీవీ షూటింగ్స్ మొత్తం ఆపేశారు.