ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. దీని దెబ్బకు హేమా హేమీలే విదేశాల్లో తిరగడానికి భయంతో వణికిపోతున్నారు. సామాన్య జనం పబ్లిక్ ప్లేస్లకి రావడానికి భయపడుతున్నారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, విహార యాత్రలు.. ఇలా ఎక్కడికీ వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ వైరస్ కారణంగా స్టార్ కొన్ని భారీ చిత్రాల నిర్మాణం అర్థాంతరంగా ఆపేయాల్సి వస్తోంది.
ఇటీవల కరోనా వైరస్ కారణంగా నాగార్జున వైల్డ్ డాగ్, రజనీకాంత్ అన్నాతే చిత్రాల షూటింగ్లని వాయిదా వేసుకున్నారు. థాయ్లాండ్ తో పాటు ఇతర దేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసుకున్న వారంతా తమ షెడ్యూల్స్ని రద్దు చేసుకుని వైరస్ తగ్గుముఖం పట్టాకే షూటింగ్కి వెళ్లాలని రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రభాస్ మాత్రం వైరస్కి బెదిరిపోకుండా యూరప్లో షూటింగ్ చేస్తోంది.
తాజాగా విక్రమ్ సినిమా షూటింగ్ కూడా కరోనా వైరస్ కారణంగా ఆగిపోయినట్టు తెలిసింది. విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం `కోబ్రా`. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర తాజా షెడ్యూల్ని రష్యాలో ప్లాన్ చేశారట. అయితే అక్కడ కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటం, అక్కడి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో `కోబ్రా` టీమ్ రష్యా షెడ్యూల్ని వాయిదా వేసినట్టు తెలిసింది.