ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలతో జూబ్లీహీల్స్లోని చిరు నివాసంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఉన్నపలంగా తలసాని మెగాస్టార్ చిరు, నాగ్లతో ప్రత్యేకంగా ఎందుకు భేటీ అయ్యారు?. ఈ సమయంలో సమావేశం కావడానికి గల రీజన్ ఏంటీ? అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షకులు ఆరా తీశారు.
అయితే గత కొంత కాలంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన అవార్డుల ఫంక్షన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం లేదు. ఏపీలోనూ అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు నందీ అవార్డుల్ని ప్రకటించారే కానీ ఫంక్షన్ని మాత్రం మరిచారు. దీంతో తెలుగు సినిమా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇక్కడి ప్రభుత్వమూ పట్టించుకోక, ఏపీ ప్రభుత్వమూ ముందుకు రాకపోవడంతో గత కొంత కాలంగా ఆర్టిస్టుల్లో అవార్డు ఫంక్షన్ల పట్ల అసహనం పెరిగిపోతోంది. దీన్నీ తెలుసుకున్న సినిమాటోగ్రఫీ మంత్రి మెగాస్టార్, నాగార్జునలతో భేటీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఓ దఫా మెగాస్టార్, నాగ్లతో భేటీ అయిన తలసాని మరో దఫా సోమవారం ప్రత్యేకంగా అన్నపూర్ణ స్టూడియోస్లో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించిన విషయాల్ని త్వరలో వెళ్లడిస్తామని, మరోసారి భేటీ అయిన అనంతరం పూర్తి వివరాల్ని మీడియాకు వెల్లడిస్తామని ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.