కొత్తదాన్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున తాజాగా కొత్త అడుగు వేస్తున్నారు. తమ సొంత నిర్మాణ సంస్థపై ఇతర సంస్థల చిత్రాల్ని రిలీజ్ చేయని నాగ్ తాజాగా ఓ బాలీవుడ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం రిలీజ్ చేయబోతున్నారు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో 1983 వరల్డ్ కప్కు ప్రత్యేక స్థానం వుంది. సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఇయర్ ఇది.
కపిల్దేవ్ నాయకత్వంలోని డేర్ డెవిల్స్ జట్టు ఇండియా చిరకాల స్వప్నాన్ని నిజం చేసి వరల్డ్ కప్ని అందించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ అపూర్వ ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ `83` పేరుతో బాలీవుడ్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. కబీర్ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. రణ్వీర్సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై అక్కినేని నాగార్జున తెలుగులో అందిస్తున్నారు.
నాగార్జున మాట్లాడుతూ ` క్రికెట్ ప్రపంచంలోనే మన దేశం 1983లో గొప్ప విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో మన దేశంలో క్రికెట్ ఓ మతం అనేంతగా మన జీవితాల్లో మమేకమై పోయింది. దీని గురించి చెప్పే చిత్రమే `83`. ఈ చారిత్రక జర్నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. అప్పటికే విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టుని మట్టికరిపించి మన దేశం తొలిసారి ప్రపవచ కప్ని సొంతం చేసుకుంది. అలాంటి గొప్ప కథతో వస్తున్న ఈ సినిమాని తెలుగులో మా సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు గర్వంగా వుంది` అన్నారు.