కరోనా ఏ ఒక్కరినీ విడిచి పెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ దీని బారిన పడి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ మధ్య సినీ తారలు కోవిడ్ బారిన పడుతున్నారు. కొంత మంది సేఫ్గా బయటపడుతుంటే కొంత మంది మాత్రం దానికే బలైపోతున్నారు. ఇటీవల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కారోనా కారణంగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
గత కొంత కొన్ని రోజులుగా కోవిడ్ సోకడంతో హీరో డా. రాజశేఖర్ చికిత్స పొంతుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఈ రోజు `ఆచార్య` షూటింగ్ ప్రారంభం కావాల్సి వుంది. ఈ నేపథ్యంలో షూటింగ్కి ముందు టీమ్ అంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో మెగాస్టార్కు కరోనా పాజిటివ్ రావడం పలువురిని షాక్కు గురిచేసింది.
తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా చిరంజీవి వెల్లడించారు. `ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను` అని వెల్లడించారు.