మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ వేరే సినిమాలను ప్రోత్సహిస్తూ ఉంటాడు. టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ లాంటివి చేస్తూ యువ టాలెంట్ ను ప్రోత్సహించే చిరు ఇప్పుడు తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు సపోర్ట్ గా నిలిచాడు. వైష్ణవ్ తేజ్ నటించిన రెండో చిత్రం కొండ పొలం రేపు విడుదలవుతోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడి మొత్తానికి విడుదలకు సిద్ధమైంది.
కొండ పొలం పేరుతోనే ఉన్న నవల ఆధారంగా ఈ చిత్రాన్ని క్రిష్ రూపొందించాడు. ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగానే ఉంది. ఇక చిరంజీవి ఈ చిత్రాన్ని ఒక రోజు ముందే చూడటం జరిగింది. ఈ చిత్రం తనకు నచ్చడంతో ట్విట్టర్ ద్వారా తన రివ్యూను షేర్ చేసుకున్నాడు చిరు.
“కొండ పొలం చిత్రాన్ని చూడటం జరిగింది. ఒక బలమైన మెసేజ్ తో రూపొందిన అందమైన రస్టిక్ ప్రేమకథ. క్రిష్ ఎప్పుడూ భిన్నమైన సినిమాలతో జోనర్స్ ను, సమాజంలో పాతుకుపోయిన సమస్యలను, ఆర్టిస్ట్ ల నుండి పెర్ఫార్మన్స్ ను రాబట్టుకునే విధానం నాకు చాలా ఇష్టం. ఈ చిత్రం కలెక్షన్స్ తో పాటు అందరి మన్ననలు, అవార్డులు సొంతం చేసుకుంటుందని నమ్ముతున్నాను. కొండ పొలం టీమ్ అందరి కెరీర్స్ లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుంది” అని చిరంజీవి ట్వీట్ చేసాడు. రకుల్ ప్రీత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.