బిగ్బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం అట్టహాసంగా ముగిసింది. 106 రోజుల పాటు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిన ఈ రియాలీటీ షోలో అభిజీత్ విజేతగా నిలిచాడు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్న చిరంజీవి విజేత అభిజీత్కు టైటిల్ ట్రోఫీని అందించారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్లపై ప్రశంసల వర్షం కురిపించారు. అభిజీత్ పరిణతిని చూసి ముచ్చటపడ్డారు. అలాగే సోహైల్, మెహబూబ్, అరియానాలపై కూడా ప్రశంసలు కురిపించారు.
ఇదే సందర్భంగా బిగ్బాస్ కంటెస్టెంట్ దివి వధ్యకు బిగ్బాస్ వేదికగా బంపర్ ఆఫర్ ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత తమిళ హిట్ ఫిల్మ్ `వేదాలం` రీమేక్ లో నటించబోతున్నారు. ఈ త్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మించనున్న ఈ మూవీలో దివికి ఓ పాత్రని ఇవ్వమని మెహర్ రమేష్కి చెప్పానని, అందుకు అతను కూడా ఓకే చెప్పారని చిరు బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే వేదిక సాక్షిగా దివికి మాటిచ్చారు. అంతే కాకుండా ఈ మూవీతో దివి పాత్ర పోలీస్ ఆఫీసర్ అని అయితే ఆమెని మరో యాంగిల్లో కూడా గ్లామర్గా చూపించమని తాను మెహర్ రమేష్తో చెప్పినట్టు చిరు స్టేజ్పైనే వెల్లడించడంతో బిగ్బాస్ కంటెస్టెంట్లు హర్షాద్వానాలు చేయడం విశేషం.