కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో డిజిటల్ మాధ్యమాలకు డిమాండ్ పెరిగింది. ప్రముఖులు కూడా ఈ బాటపడుతుండటంతో కొత్త కొత్త వెబ్ సిరీస్లు వెలుగులోకి వస్తున్నాయి. యాదార్ధ సంఘటనలే కాకుండా ఫేమస్ నవలల ఆధారంగానూ వెబ్ సిరీస్ల నిర్మాణం ఊపందుకుంటోంది. మధుబాబు ఫేమస్ నవల `షాడో` ఆధారంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర వెబ్ సిరీస్ని నిర్మించనున్న విషయం తెలిసిందే.
తాజాగా మరో ఫేమస్ నవల వెబ్ సిరీస్గా తెరపైకి రానున్నట్టు తెలుస్తోంది. తెలుగు సాహిత్యంలో చలం (గూడిపాటి వెంకటాచలం) ప్రత్యేక స్థానం వున్న విషయం తెలిసిందే. మైదానం, మ్యూజింగ్స్, ప్రేమలేఖలు… తదితర రచనలకు లక్షల్లో అభిమానులున్నారు. చలం రచనల్లోని `మైదానం`కు ప్రత్యేక స్థానం వుంది. ఆ నవల ఆధారంగా త్వరలో ఓ వెబ్ సిరీస్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ని దర్శకుడు వేణు ఊడుగుల తెరపైకి తీసుకురాబోతున్నారు. నీది నాది ఒకే కథ, ప్రస్తుతం `విరాటపర్వం` వంటి చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న వేణు ఊడుగుల తన దర్శకత్వ శాఖలో పనిచేసిన ఓ వ్యక్తిని ఈ వెబ్ సిరీస్ ద్వారా దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారట.
నైజాంకు చెందిన ఓ ముస్లీమ్ యువకుడు, ఆంధ్రాకు చెందిన ఓ పెళ్లైన బ్రాహ్మణ యువతితో ప్రేమాయణం సాగించడం, ఆమెని నైజాంకు తీసుకొచ్చి ఓ మైదాన ప్రాంతంలో కలిసి .జీవనం సాగించడం నేపథ్యంలో ఈ నవల సాగుతుంది. 1927లో ప్రచురితమైన ఈ నవల పెను వివాదాన్ని సృష్టించింది. వెబ్సిరీస్గా తెరపైకి రానున్న ఈ నవల ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సంచలనాలకు తెరలేపుతుందో చూడాలి.