కరోనా దెబ్బతో సినీ ఇండస్ట్రీలో మార్పులు మొదలయ్యాయి. సినిమా షూటింగ్లు ప్రారంభం కాకపోవడంతో చాలా మంది నటీనటులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది కొత్త దారులు వెతుక్కుంటున్నారు కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ రీ ఓపెన్ చేసే పరిస్థితులు కనిపించకపోవడంతో పేరున్న నటీనటులు కొత్త రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం సినీ రంగానికి ప్రత్యమ్నయంగా కనిపిస్తున్న రంగం డిజిటల్ వరల్డ్.
కరోనా ప్రభావం మొదలైన దగ్గరి నుంచి ఓటీటీ ప్రవాహం, ప్రముఖ్యత పెరిగిపోతోంది. చాలా మంది ఈ రంగంవైపు అడుగులు వేయడం మొదలైంది. రిలీజ్కి సిద్ధంగా వున్న చాలా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా డిజిటల్ రంగంలోకి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిసింది.
మధుబాబు ఫేమస్ నవల `షాడో` ఆధారంగా వెబ్ సిరీస్ని నిర్మించబోతున్నానంటూ ఇటీవల ఏకే ఎంటర్టైన్మెంట్ అధినేత అనిల్ సుంకర ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్కి `రాజా చెయ్యివేస్తే` ఫేమ్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ వెబ్ సిరీస్లో ప్రకాష్రాజ్ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే సైలెంట్గా షూటింగ్ మొదలుపెట్టారట. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం వుందని తెలిసింది.