సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పలు ఈ కేసులో రోజుకో సంచలన విషయం బయటికి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసుని సుప్రీమ్ కోర్టు సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సుప్రీమ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ సుశాంత్ మృతి వెనకున్న మిస్టరీని ఛేదించే పనిలో పడింది. కేసు దర్యాప్తులో వేగం పెంచడంతో పలు కీలక అంశాలు బయటపడుతున్నాయి.
సుశాంత్ తండ్రి కెకె సింగ్ రాజ్పుత్ అనుమానం వ్యక్తం చేస్తూ రియాపై కేసు పెట్టడంతో అందరి చూపు అటువైపు మళ్లింది. తాజాగా ఈ కేసులో రియా ప్రధాన సస్పెక్ట్ కావడం తో సీబీఐ సమన్లు జారీ చేసినట్టు తెలిసింది. రియాతో పాటు ఆమె తండ్రికి కూడా సీబీఐ సమన్లు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గతంలో సుశాంత్ హిందూజా ఆసుపత్రిలో రెండు నెలల పాటు చికిత్స పొందారట. ఈ విషయంపై సీబీఐ ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఆదివారం ఈ ఆసుపత్రిని సీబీఐ బృందం సందర్శించింది. సుశాంత్ చికిత్స పొందుతున్న సమయంలో ఎలా ప్రవర్తించాడు? అప్పుడు అతనితో ఎవరున్నారు. రియా ఆసుపత్రికి వచ్చిందా? ఆ సమయంలో సుశాంత్ తో ఎవరున్నారు? అనే విషయాలపై సీబీఐ ఆరా తీసినట్టు తెలిసింది.