కరోనా మహమ్మారి ఏ ఒక్కరినీ వదలడం లేదు. ఎంత పెద్ద సెలబ్రిటీ కానీ, రాజకీయ నేతల్ని కానీ విడిచి పెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు, సినీ తారల నుంచి రాజకీయ నేతల వరకు ప్రతీ ఒక్కరినీ కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. తాజాగా అమితాబ్ బచ్చన్ కరోనా సోకి ఇటీవలే క్షేమంగా బయటపడ్డ విషయం తెలిసిందే.
ఇక టాలీవుడ్లో వరుసగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. బండ్ల గణేష్ ముందుగా కరోనా బారిన పడగా ఆయన సులువుగానే ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. నటుడు సమ్రాట్ సోదరి, సమంత స్నేహితురాలు కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కుటుంబం కరోనా పాజిటివ్ అని తేలడంతో హోమ్ క్వారెంటైన్లోకి వెళ్లిపోయింది. దర్శకుడు తేజ కూడా హోమ్ క్వారెంటైన్లో వుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజాగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి కరోనా సోకినట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. గత పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, అన్ని చోట్ల టెస్టులు చేయించినా నెగెటివ్ వచ్చిందని, డాక్టర్లని సంప్రదించిన తరువాత ఆసుపత్రిలో చేరానని, అందరి ఆశస్సులు, తిరుపతి వెంకన్న దయతో త్వరగా కోలుకుంటానని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వెల్లడించారు.