టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఏం చేసినా కొత్తగానే వుంటుంది. భిన్నంగానే వుంటుంది. కరోనా ఉధృతి మొదలైన సందర్భంలో ద దేవరకొండ ఫౌండేషన్ పేరుతో మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందిస్తూ బాసటగా నిలిచారు. చాలా కుటుంబాలకు అవసరాలని తీర్చారు. గత కొన్ని రోజులుగా కరోనా తీవ్ర రూపం దాల్చడంతో సైలెంట్ అయిన ఆయన మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. కరోనా ని జయంచి వారి ప్లాస్మాని మరో ఇద్దరికి దానం చేసి వారి ప్రాణాలు కాపాడిన వారిని సీపీ సజ్జనార్, హీరో విజయ్ దేవరకొండ సైబరాబాద్ కమీషనరేట్లో సత్కరించారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత నెల మాకు తెలిసిన వ్యక్తులకు కరోనా సోకింది. వారికి ప్లాస్మా అవసరం ఏర్పడింది. కానీ ఎక్కడా ప్లాస్మా దాతలు దొరకలేదు. అప్పుడే ప్లాస్మా ప్రాధాన్యత ఏంటో తెలిసింది. ఇంతకు ముందు ప్లాస్మా డొనేట్ చేయాలంటే చిన్న కన్ఫ్యూజన్ వుండేది కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. donateplasma.scsc.in అనే వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుంటే చాలు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్లాస్మా దానం చేస్తే ఇద్దరి ప్రాణాలు కాపాడిన వారవుతారన్నారు.
వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు. మన ముందున్న ఆయుధం ప్లాస్మా. రికవరీ అయిన ప్రతీ ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలని కోరుకుంటున్నాను. ఒక వేళ నాకు కరోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా` అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.