నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను ముచ్చటగా మూడవ సారి కలిసి ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య తొలిసారి అఘోరాగా కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన కీలక ఘట్టాలని వారణాసి నేపథ్యంలో చిత్రీకరించాలని దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు. కరోనా దెబ్బతో షెడ్యూల్ వాయిదా పడింది.
ఇటీవల బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బీబీ3 ఫస్ట్ రోర్ పేరుతో బాలకృష్ణ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. టీజర్లో బాలయ్య చెప్పిన డైలాగ్లు, గెటప్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్ రిలీజైన తొలి రోజే రికార్డు స్థాయి వ్యూస్ని దక్కించుకోవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.
ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్లో కరోనా ప్రమాద స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కరోనా ఉదృతి దృష్ట్యా షూటింగ్లు ముందుకు సాగడం కష్టంగా మారిన నేపథ్యంలో చిత్ర బృందం తమ ఆలోచనని మార్చుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రానికి `మోనార్క్` అనే టైటిల్ని బోయపాటి శ్రీను ఖరారు చేయనున్నారు.