ఊరమాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి నేటికి 15 ఏళ్లవుతోంది. రవితేజ హీరోగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం `భద్ర`. 2005 మే 12న ఈ చిత్రం విడుదలైంది. తొలి సినిమాతో యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో చిత్రాల్ని తెరకెక్కించడంలో పట్టున్న దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ఆ తరువాత వెంకటేష్తో `తులసి`, నందమూరి బాలకృష్ణతో `సింహా`, ఎన్టీఆర్తో `దమ్ము`, బాలయ్యతో `లెజెండ్`, స్టైలిష్స్టార్ అల్లు అర్జున్తో `సరైనోడు`. బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో `జయజానకి నాయక`, రామ్చరణ్తో `వినయ విధేయ రామ` వంటి చిత్రాలు రూపొందించారు. 15 ఏళ్ల ప్రయాణంలో చేసింది 8 చిత్రాలే అయినా స్థాయి డైరెక్టర్గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారాయన.
ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ `15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది. చాలా రకాల ఎమోషన్స్, కలలు, పాషన్, ఎంటర్టైన్ చేయాలనే లక్ష్యంతో తొలి అడుగు వేశాను. చాలా జ్ఞాపకాలు, సవాళ్ళతో నేను ఊహించిన దానికంటే అందంగా ఇన్నేళ్ల ప్రయాణం సాగింది. నా మార్టంలో నేను కలిసిన ప్రతి వ్యక్తి వల్లనే ఇది సాధ్యమైంది. నేను నా సినిమాల్లో వర్క్ చేసిన నా యాక్షన్ హీరోలకు, అందమైన హీరోయిన్స్కు, విజన్ వున్న నిర్మాతలకు సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్ట్లకు, ప్రేక్షకులకు నా కుటుంబానికి వీటన్నింటికీ మించి దేవుడికి కృతజ్ఞతలు` అన్నారు. బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.