నటీనటులు : రానా, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గాంకర్, రఘుబాబు, అనంత్ మహదేవన్, టిను ఆనంద్, అశ్విన్రాజా, విశ్వతేజ్ ప్రధాన్ తదితరులు నటించారు.
దర్శకత్వం: ప్రభు సాల్మన్
నిర్మాత: ఏరోస్ ఇంటర్నేషనల్
సంగీతం: శంతను మొయిత్రా
సినిమాటోగ్రఫీ : ఏఆర్ అశోక్ కుమార్
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
రిలీజ్ డేట్ : 26 -03-21
రేటింగ్ : 3/5
`బాహుబలి` తరువాత రానా కథల ఎంపికలో పంథా మారింది. పాత్రల పరంగానూ వైవిధ్యం చూపిస్తున్నారు. భారీ స్పాన్ వున్న చిత్రాల్ని, కథల్ని ఎంచుకుంటూ టాక్ ఆఫ్ ది కంట్రీగా మారుతున్నారు. రానా నటిస్తున్న తాజా చిత్రం `ఆరణ్య`. పాన్ ఇండియా స్థాయి కథ. `నేనే రాజు నేను మంత్రి` వంటి హిట్ సినిమా తరువాత రానా హీరోగా నటించిన చిత్రమిది. మనిషికి ప్రకృతికి మధ్య యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రచార చిత్రాలతో ఇప్పటికే భారీ హైప్కి క్రియేట్ చేసింది. రానా గెటప్, ప్రచార చిత్రాలు క్రియేట్ చేసిన హైప్కి తగ్గట్టే సినిమా వుందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
విశాఖ సమీపంలోని చిలకలకోన అడవి అది. అక్కడ తరతరాలుగా ఏనుగుల్ని రక్షించే ఓ కుటుంబంలో పుట్టి పెరుగుతాడు నరేంద్ర భూపతి (రానా). అడవి కోసం, ఏనుగుల రక్షణ కోసం లక్ష మొక్కలు నాటి ఫారెస్ట్ మెన్గా రాష్ట్రపతి అవార్డు అందుకున్న నరేంద్ర భూపతిని అంతా అరణ్య అంటూ పిలుస్తుంటారు.
ఈ క్రమంలో కేంద్ర మంత్రి కనకమేడల రాజగోపాల్ (అనంత్ మహదేవన్) చిలకలకోన అడవిపై కన్నేస్తాడు. అక్కడ డీఎల్ ఆర్ టౌన్షిప్ కట్టేందుకు అనుమతులిస్తాడు. ఏనుగులు నీటి కోసం వెళ్లే అటవీ ప్రాంతంలో గోడ కూడా కట్టేస్తారు. మరి అడవినే నమ్ముకున్న ఏనుగులు, అరణ్య.. కేంద్ర మంత్రిపై ఎలా పోరాటం చేశారు? అడవిని ఎలా దక్కించుకున్నారు అన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం.
నటీనటుల నటన:
హీరో రానా అడవి మనిషి అరణ్య పాత్రలో నటించారనడం కంటే జీవించారని చెప్పొచ్చు. అడవి మనిషి పాత్రని తెరపై ఆవిష్కరించడానికి ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం రానా పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ఆ పాత్రలో ఆయన పలికించిన హావ భావాలు. నడక, నటనల్లో చూపించిన వైరూధ్యం తెరపై ఆకట్టుకుంటుంది. తమిళ హీరో విష్ణు విశాల్ శింగన్న పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
హిందీ నటి జోయాతో విష్ణు విశాల్ లవ్ ట్రాక్ కూడా అలరిస్తుంది. మీర్జాపూర్` ఫేమ్ శ్రియా పిల్గాంకర్ జర్నలిస్టుగా కీలక పాత్రలో నటించింది. కేంద్ర మంత్రిగా అనంత్ మహదేవన్, విష్ణు విశాల్తో కలిసి ట్రావెల్ చేసే పాత్రలో రఘుబాబు తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణుల తీరు:
ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సాంకేతికంగా ఉన్నతంగా వుంది. అశోక్ కుమార్ కెమెరా పనితనం అడవి అందాల్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించింది. దట్టమైన అభయారణ్యాలని తెరపై చూపించిన తీరు చాలా బాగుంది. శంతను మొయిత్రా సంగీతం, రసూల్ పోకుట్టి సౌండ్ డిజైన్ సగటు ప్రేక్షకుడిని అడవిలో వున్న ఫీల్ని కలిగిస్తుంది. దర్శకుడు ప్రభు సాల్మన్ కథ కంటే కూడా తన మార్కు పాత్రతో ఓ మంచి సందేశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
తీర్పు:
ఫారెస్ట్ మెన్ ఆఫ్ ఇండియాగా అవార్డు అందుకున్న ఓ వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీని స్ఫూర్తిగా తీసుకుని చేసిన సినిమా ఇది. రానా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తీరు, అబ్బుర పరిచే అడవి దృశ్యాలు సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రకృతి వర్సెస్ మనిషి నేపథ్యంలో సాగే ఈ కథలో చర్చించిన పాయింట్, సందేశం గొప్పదే అయినా దాన్ని తెరపైకి జనరంజకంగా తీర్చి దిద్దడంలో మాత్రం కొన్ని లోపాలు కనిపించాయి. ఊహించే సన్నివేశాల, స్లో నరేషన్తో ప్రేక్షకుడిని ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేదనే చెప్పాలి.