కరోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించి ఈ నెలతో ఏడాది పూర్తయింది. కారోనా కారణంగా దేశ వ్యాప్తంగా వున్న పలు కీలక రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. లాక్డౌన్లో సడలింపులు విధించడం.. నవంబర్ నుంచి పూర్తి స్థాయిలో మాల్స్, థియేటర్స్ రీఓపెన్ కావడంతో సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. థియేటర్లు తెరవడం, ఇటీవల సంక్రాంతికి విడుదలైన చిత్రాలకు అనూహ్య సంపందన రావడంతో టాలీవుడ్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో యావత్ దేశం మొత్తం టాలీవుడ్ వైపు తిరిగిచూస్తోంది. ఎక్కడా లేనంతగా సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఇక్కడ బ్రహ్మరథం పట్టడం, థియేటర్లకు వచ్చి సినిమాలని ప్రోత్సహించడంతో బాలీవుడ్ పరిశ్రమ విస్మయానికి లోనవుతోంది. ఇదిలా వుంటే మళ్లీ దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొందలవుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ చిత్రాల రిలీజ్లు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలో రానా నటించిన `హాథీ మేరే సాథీ` చిత్రాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు ఈ రోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది.
అయితే తెలుగు, తమిళ వెర్షన్లు మాత్రం మార్చి 26న ప్రకటించిన విధంగానే థియేటర్లలో రిలీజ్ అవుతాయని మేకర్స్ ప్రకటించారు. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో `అరణ్య`గా, తమిళంలో `కాండన్`గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.