20 ఏళ్ల క్రితమే భవిష్యత్ ఎలా వుంటుందో ఊహించి తన సినిమాలో చెప్పిన గ్రేట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన తెర కెక్కించిన `ఆదిత్య 369` ఓ టైమ్ మెషిన్ ఆధారంగా రూపొందింది. కొన్నేళ్ల తరువాత ప్రపంచ వినాశనం ఎలా వుంటుందో ముందే ఊహించి తెరకెక్కించిన ఆయన గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వచ్చారు.
88 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నారు. ఓ గాయని జీవిత కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆయన రూపొందించబోతున్నారు. బెంగళూరుకు చెందిన దేవదాసి నాగరత్నమ్మ ఆ తరువాత కాలంలో గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. జీవిత చరమాంకంలో యోగినిగా మారింది. అలాంటి పవర్ఫుల్ మహిళ జీవిత కథ ఆధారంగా సింగీతం బయోపిక్ని తెరపైకి తీసుకురాబోతున్నారు.
ఇందులో నాగరత్నమ్మగా అనుష్క నటించే అవకాశం వుందని తెలిసింది. ఇటీవలే లైన్ విన్న అనుష్క ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్టు తెలిసింది. అనుష్క ప్రస్తుతం `నిశ్శబ్దం` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుత పరిస్థితులని బట్టి రిలీజ్ వాయిదా పడినా ఆశ్చర్యం లేదు.