మహేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం శనివారం విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఊహించిన స్థాయిలో సినిమా హిట్ కావడంతో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తొలి రోజు ఉదయం 7 గంటల షోని హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో చిత్ర బృందం ప్రత్యేకంగా ప్రేక్షకులతో కలిసి సినిమా చూసింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని, చెప్పినట్టే సినిమా దద్దరిల్లిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి బ్లాక్బస్టర్ టాక్ వస్తోందని, ఇంటర్వెల్ బ్యాంగ్ రోమాంచితంగా వుందని, రైలు ఎపిసోడ్ వచ్చినప్పుడు థియేటర్లో ఎవరూ సీట్లో కూర్చోలేదని, అంతా పడి పడి నవ్వుతున్నారని, దీంతో ఈ సంక్రాంతి నవ్వులతో నిండిపోతుందని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు.
దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఈ సినిమాని హీరోయిన్ రష్మిక మందన్న, శ్రీనివాసరెడ్డి, మరో దర్శకుడు వంశీ పైడిపల్లి, దేవిశ్రీప్రసాద్, నమ్రత, సంగీత, దేవిశ్రీప్రసాద్ వీక్షించారు. ఈ క్రమంలో రష్మికని చూసిన ఫ్యాన్స్ ఈలలు వేస్తూ రచ్చ చేయడం ఆసక్తికరంగా మారింది.