మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దదర్శకత్వం వహిస్తున్నారు. `ఎఫ్2` వంటి హిలేరియస్ బ్లాక్ బస్టర్ తరువాత అనిల్ రావిపూడి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజుతో కలిసి ఈ చిత్రాన్ని ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా ఇందులో కనిపించబోతున్నారు. దాదాపు 14 ఏళ్ల విరామం తరువాత లేడీ సూపర్స్టార్ విజయశాంతి ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్ టీజర్కి ప్రేక్షకుల నుంచి, ట్రేడ్ వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. దేశ రక్షణ కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టి వీర మరణం పొందిన సైనికులకు అంకితం చేస్తూ ఇటీవల విడుదల చేసిన టైటిల్ సాంగ్, టీజర్లో `మన దగ్గర బేరాలేవీ లేవమ్మా` అంటూ మహేష్ చెప్పిన డైలాగ్లతో సినిమాపై మరింత క్రేజ్ని తీసుకొచ్చింది. ఈ చిత్రానికి టెక్నీషియన్స్, పోస్ట్ప్రొడక్షన్ వర్క్ కలిపి 100 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. నటీనటుల, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే 65 దాటిందట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ రూపంలో మరో 35 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇందులో కేవలం కాశ్మీర్ ఎపిసోడ్లో చిత్రీకరించిన కీలక సన్నివేశాలకే భారీ స్థాయిలో చిత్ర బృందం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో హీరో మహేష్బాబు పారితోషికం లెక్క కట్టలేదు. ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి రావడానికి ముందు ఓ ఒప్పందాన్ని హీరో, నిర్మాతలు చేసుకున్నారట. హీరో పారితోషికం కాకుండా వచ్చిన లాభాల్లో వాటా రూపంలో తీసుకోవాలన్నది ఒప్పందం. అందుకు గాను హీరో మహేష్కు ఈ సినిమా ద్వారా దాదాపు 50 కోట్లు అందబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సినిమా బడ్జెట్ ఇప్పటికే 100 కోట్లు దాటింది. దీన్ని మించి బిజినెస్ చేయగలిగితేనే నిర్మాతలకు లాభాలు వస్తాయి. 50 కోట్ల మొత్తం హీరోకు అందించిన తరువాత మిగిలిన మొత్తాన్ని మాత్రమే నిర్మాతలు దిల్రాజు, అనిల్ సుంకర పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారట. మరి అనుకున్న స్థాయిలో అందరికి వాటాలు తేలాలంటే సినిమా 100 కోట్లకు మించి బిజినెస్ చేయాలి. ఆ స్టామినా `సరిలేరు నీకెవ్వరు` చిత్రానికి వుందా? అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.