టాలీవుడ్ లో 100 శాతం సక్సెస్ రేట్ ఉన్న అతి కొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఇప్పటివరకూ 5 సినిమాలను డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి అన్ని సినిమాలతో సూపర్ హిట్లు సాధించాడు. తన లాస్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరం చూసాం. ప్రస్తుతం 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఎఫ్ 2కు సీక్వెల్ ఎఫ్ 3 స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి, ఈ ఏడాది చివరి నుండి ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో కంటిన్యూ అవుతారని చెప్పాడు అనిల్ రావిపూడి.
అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ఎఫ్ 3 పనుల్లో ఉన్నా కూడా వేరే హీరోలకు కథలు కూడా సిద్ధం చేసుకుంటున్నా. మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అద్భుతమైన పాయింట్ దొరికింది. దాన్ని కథగా మార్చే పనుల్లో ఉన్నాను. ఒక్కసారి లాక్ డౌన్ తీయగానే మెగాస్టార్ ను కలిసి నా స్క్రిప్ట్ ను నరేట్ చేస్తాను. చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి దర్శకులం అయినవాళ్ళం. ఇప్పుడు ఆయన్నే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే అదృష్టమే కదా అంటున్నాడు అనిల్ రావిపూడి. తన వద్ద నందమూరి బాలకృష్ణ కోసం కూడా ఒక పాయింట్ ఉందని అంటున్నాడు. గతంలోనే బాలయ్యతో ఒక సినిమా చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యాడు. మళ్ళీ మరోసారి ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం చిరంజీవి వరస సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చేస్తోన్న ఆచార్య పూర్తవ్వగానే సుజీత్ దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ ను చేయాల్సి ఉంది. దాని తర్వాత బాబీ, మెహెర్ రమేష్ దర్శకులతో సినిమాలు ఉంటాయని రీసెంట్ గా ప్రకటించిన విషయం తెల్సిందే.