అనిల్ రావిపూడి పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. ఈ దర్శకుడు ఇప్పటివరకూ తెరకెక్కించిన ఐదు సినిమాలూ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి అటు నటులు, ఇటు దర్శకులు, నిర్మాతలు అందరూ కూడా ఎదురుచూస్తున్నారు. దర్శకుడిగా 100 పెర్సంట్ ట్రాక్ రికార్డ్ ఉన్న అతి కొద్ది మందిలో అనిల్ రావిపూడి ఒకరు. కామెడీ తన ప్రధాన బలం. అయితే అనిల్ రావిపూడి గురించి ఇప్పుడిలా మాట్లాడుకుంటున్నాం కానీ ప్రతీ దర్శకుడిలానే అనిల్ కూడా మొదటి సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మొదట ఘోస్ట్ రైటర్ గా, ఆ తర్వాత రైటర్ గా కొనసాగిన తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కించిన మొదటి సినిమా పటాస్.
అయితే దర్శకుడయ్యాక అనిల్ స్థాయి వేరు కానీ రైటర్ గా ఉన్నప్పుడు అనిల్ కు ట్రీట్మెంట్ ఎలా ఉండేది అంటే ఆసక్తికర సమాధానం చెప్పాడు. అందరిలానే తాను కూడా రైటర్ గా ఉన్నప్పుడు అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. కెరీర్ మొదట్లో హిట్ సినిమాలకు తన పేరు పడేది కాదని, పేరు పడిన సినిమాలు మాత్రం ప్లాపయ్యేవని తెలిపాడు. శౌర్యంకు రైటర్ గా పనిచేసినా కానీ రత్నం గారికే క్రెడిట్ మొత్తం వెళ్ళింది. అయితే శంఖం సినిమాకు క్రెడిట్ ఇచ్చారు కానీ ఆ సినిమా ఆడలేదు అని తెలిపాడు.
అలాగే అనిల్ రావిపూడి రైటర్ గా ఉన్నప్పుడు నటులకు సీన్లు చెబుతుండేవాడినని, అలాగే శంఖం సినిమాకు ఇద్దరు నటుల వద్దకు సీన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు తనను అవమానించారని తెలిపాడు. వారి దగ్గరకు వెళ్లి తాను రైటర్ ని అని చెప్పగా “అదండీ పెన్ను పేపర్ ఉన్న ప్రతీ ఒక్కడూ రైటర్ అని ఫీలైపోయేవాడే. డైలాగులేమో ఇలా ఉంటాయి. వాటిని మనం ఇంప్రొవైజ్ చేసుకోవాలి” అని అన్నాడుట ఒక నటుడు. అలాగే తన గోల్ దర్శకుడు అని చెప్పగానే “వీడు డైరెక్టర్ కూడా అవుతాడట” అంటూ దాదాపు 10 నిముషాలు తన గురించి చాలా ఎగతాళిగా మాట్లాడారని గుర్తుచేసుకున్నాడు.
ఐతే తాను డైరెక్టర్ అయ్యాక తన సినిమాల్లో ఇప్పటివరకూ ఆ ఇద్దరూ నటించలేదని గుర్తుచేసుకున్నాడు.