ఈ ఏడాది ప్రారంభంలో `సరిలేరు నీకెవ్వరు` అంటూ బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరారు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాతో మరోసారి వంద కోట్ల క్లబ్లో చేరిన ఆయన తన నెక్ట్స్ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ `ఎఫ్2`కు సీక్వెల్గా `ఎఫ్3` స్క్రిప్ట్ని సిద్ధం చేసుకున్నారు.
అయితే ఇందులో నటించే హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ వరుస ప్రాజెక్ట్లతో బిజీగా వుండటం, అవి కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోవడంతో అనిల్ రావి పూడి `ఎఫ్2` ప్రయత్నాలకు బ్రేక్ ఏర్పడింది. దీంతో ఈ సమయంలో చిన్న సినిమా చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం ఇప్పటికే ఓ కథని సిద్ధం చేసుకున్న ఆయన `మజిలీ` ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి, హరీష్ పెద్దిలని ఒప్పించినట్టు తెలిసింది.
గతంలో ఈ ప్రొడ్యూసర్స్ అనిల్ రావిపూడికి ఓ సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారట. అది ఇంత వరకు కార్యరూపం దాల్చలేదట. దాని కోసమే వారికి అనిల్ రావిపూడి స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇందులో ఎవరెవరు నటిస్తారు? .. ఎప్పుడు మొదలవుతుంది.. వంటి వివరాల్ని దర్శకుడు అనిల్ రావిపూడి త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిసింది.