బుల్లితెర యాంకర్ అనసూయకు తమిళ ఇండస్ట్రీ స్వాగతం పలుకుతోందట. సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` అనసూయ కెరీర్ని మలుపు తిప్పింది. రంగమ్మత్తగా హీరోకు అత్యంత సన్నిహితంగా వుండే పాత్రలో అనసూయ మంచి మార్కులు కొట్టేసింది. ఈ మూవీ ద్వారా ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ పురస్కారంతో పాటు సైమా అవార్డుని కూడా దక్కించుకుని వార్తల్లో నిలిచి ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది.
`రంగస్థలం`తో టాలీవుడ్లో క్రేజ్ని సొంతం చేసుకున్న అనసూయ ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్లలో నటిస్తోంది. బన్నీ – సుకుమార్ల కలయికలో రూపొందుతున్న `పుష్ప`, మెగాస్టార్ నటిస్తున్న `ఆచార్య`. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న `రంగ మార్తాండ` చిత్రాల్లోని కీలక పాత్రల్లో అనసూయ నటిస్తోంది. ఇవీ కాకుండా రవితేజ `ఖిలాడీ`, నాగచైతన్య `థ్యాంక్యూ` చిత్రాల్ని అంగీకరించిందట.
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా వున్న అనసూయ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. `మరో గుడ్ స్టోరీ లభించింది. కొత్త ప్రయాణం మొదలైంది` అంటూ తమిళంలో ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రకటించింది అనసూయ. ఇటీవల విజయ్ సేతుపతితో కలిసి ఓ ఫొటోని షేర్ చేయడంతో అనసూయ నటిస్తున్న తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడా? అని అంతా ఆరా తీస్తున్నారు.