కరోనా ఏ ముహూర్తాన మొదలైందో కానీ ఓ పండగ లేదు.. ఓ ఫంక్షన్ లేదు. జనం వీటిని మరిచి దాదాపు రెండు నెలలు దాటుతోంది. ముందు ఫిక్స్ చేసుకున్న ఫంక్షన్లు, పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ప్లాన్ చేసుకున్న వాళ్లల్లో చాలా మంది సింపుల్ వెడ్డింగ్తో సరిపెట్టుకుంటున్నారు. వందల మంది హాజరు కావాలని ఆశపడిన వారంతా పెళ్లి జరిగితే చాలు మహా ప్రభో అనే స్థాయికి రాజీపడుతున్నారు.
యంగ్ హీరో నితిన్ గత నెల ఏప్రిల్లో వివాహం చేసుకోవాలని ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ కరోనా విళయతాండవం చేస్తుండటంతో తన వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఇదే తరహాలో హీరో నిఖిల్ కూడా డా.పల్లవి వర్మని వివాహం చేసుకోవాలని ఏప్రిల్లోనే ముహూర్తం పెట్టుకున్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ గురువారం ఉదయం అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు.
రంగస్థలం, మహానటి చిత్రాలతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న కామెడియన్ మహేష్ కూడా ఈ రోజే వివాహం చేసుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడుకు చెందిన పావనితో మహేష్ వివాహం గురువారం ఉదయం జరిగింది.