గత ఏడు నెలలుగా `పుష్ప` టీమ్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలుపెట్టాలా అని ఎదురుచూస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా ఫిల్మ్గా నిర్మించాలని భారీ ప్లాన్స్ వేసుకున్నారు. బన్నీ కూడా `అల వైకుంఠపురములో` ఇండస్ట్రీ హిట్ కావడంతో `పుష్ప` కోసం సిద్ధమయ్యారు. హెయిర్ పెంచారు. గడ్డం పెంచారు. అయితే కరోనా బన్నీ ప్లాన్కి దెబ్బకొట్టింది. దీని కారణంగా లాక్డౌన్ విధించడంతో కేరళలో మొదలుపెట్టాల్సిన ఈ మూవీ కీలక షెడ్యూల్ని వాయిదా వేశారు.
తాజాగా అన్ని కీలక చిత్రాల షూటింగ్స్ ఒక్కొక్కటిగా రీ స్టార్ట్ అవుతుండటంతో `పుప్ప` టీమ్ కూడా రెగ్యులర్ షూటింగ్కి రెడీ అవుతోంది. నవంబర్ 2 నుంచి రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభం కాబోతోంది. నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో బన్నీ పాల్గొనగా కీలక పోరాట ఘట్టాల్ని చిత్రీకరిస్తారట. అంతే కాకుండా హీరోయిన్ రష్మిక, బన్నీపై కూడా కీలక సన్నివేశాల్ని పూర్తి చేయాలిని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అడవుల్లో అత్యధిక శాతం చిత్రీకరణ చేసుకోనున్న ఈ చిత్రాన్ని ముందు కేరళ అడవుల్లో షూట్ చేయాలనుకున్నారు. ప్రస్తుత తరుణంలో అది రిస్క్ అని భావించిన బన్నీ ఆసక్తి చూపించకపోవడంతో అదిలాబాద్ లోని కుంటాలా జలపాతానికి సమీప అడవుల్లో షూట్ చేయాలని ప్లాన్ చేశారు. లొకేషన్ చూడ్డానికి స్వయంగా బన్నీ వెళ్లాడు. అతన్ని చూడటానికి అక్కడి జనం ఎగబడటంతో ఆ తరువాత స్థానిక పోలీస్టేషన్లో బన్నీ, `పుష్ప` టీమ్ పై కేసు ఫైల్ కావడం వివాదంగా మారింది.
ఇక అక్కడ షూటింగ్ చేయడం ఇష్టం పడని టీమ్ ఫైనల్గా రంపచోడవరంని ఎంచుకుంది. రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో నెల రోజుల పాటు `పుష్ప` టీమ్ కీలక ఘట్టాలని పూర్తి చేయబోతోంది. ఇందు కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికని సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇక్కడ కీలక ఘట్టాలని పూర్తి చేసి తరువాత వాతావరణ అనుకూలతలని బట్టి కేరళకు పయనం అవుతుందట.