`బాహుబలి` వంటి సెన్సేషనల్ హిట్ సినిమా తరువాత చాలా మంది ప్రొడ్యూసర్స్ భారీ చిత్రాలని అందులోనూ వేల కోట్ల బడ్జెట్తో మహాభారత, రామాయణ గాధల్ని తెరపైకి తీసుకురాబోతున్నామని, హాలీవుడ్ టెక్నాలజీని జోడించి మన పురాణ గాధల్ని మరింత కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నామంటూ వరుసగా ప్రకటనలు గుప్పించారు. ఇదే సమయంలో మలయాళ మేకర్ ఆంటోని పెరంబువార్ మహాభారత గాధని తెరపైకి తీసుకొస్తానని దీనికి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ని కేటాయిస్తున్నామంటూ ప్రకటించారు.
ఈ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఓ భారీ ప్రకటన చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. రామాయణ గాధని తెరపైకి తీసుకురాబోతున్నామని, మూడు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి దాదాపు 1500 కోట్లు బడ్జెట్ అవుతుందని ప్రకటించారు. దీనికి `దంగల్`, చిచోర్` ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తారని వెల్లడించారు.
రాముని పాత్ర కోసం హృతిక్ రోషన్ని సంప్రదించారు కూడా. కానీ హృతిక్ ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తిని చూపించలేదు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి ఏడాది పై చిలుకే కావస్తున్నా దీనికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా ప్రభాస్ రామాయన గాధ నేపథ్యంలో `ఆదిపురుష్` చిత్రం చేస్తుండటంతో అల్లు అరవింద్ రామాయణం ప్రాజెక్ట్ ఇక కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ని మెగా ప్రొడ్యూసర్ ఎప్పుడో పక్కన పెట్టేశాడని, ఇది ఇక కార్యరూపం దాల్చడం కష్టమని చెబుతున్నారు.