పవర్స్టార్ పవన్కల్యాణ్ రెండేళ్ల విరామం తరువాత వరుస చిత్రాల్లో నటిస్తూ షాకిస్తున్నారు. ఏడాదికి, రెండేళ్లకు ఒకే ఒక్క చిత్రంలో మాత్రమే నటిస్తూ వచ్చిన ఆయన తన పంథాకు పూర్తి భిన్నంగా ఈ ఏడాది నాలుగు చిత్రాల్లో నటించబోతున్నాడు. ముందు `పింక్` రీమేక్ని మొదలుపెట్టిన ఆయన తాజాగా క్రిష్ డైరెక్షన్లో పిరియాడికల్ ఫిల్మ్ని కూడా మొదలుపెట్టేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాబిన్ హుడ్గా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన పండుగల సాయన్న కథని క్రిష్ ఈ చిత్రం ద్వారా తెరపైకి తీసుకొస్తున్నారు.
ఏ.ఎం. రత్నం అత్యత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో మూడు భారీ సెట్ల నిర్మాణం కూడా జరుగుతోంది. మొఘలాయిలా కాలం నాటి కథ కావడంతో తాజ్ మహల్, చార్మినార్ సెట్లతో పాటు ఓ వాటర్ ఫాల్ సెట్ని కూడా నిర్మిస్తున్నారు. ముందు ఈ చిత్రానికి మేకర్స్ అనుకున్న బడ్జెట్ 100 కోట్లు. పవర్స్టార్ పారితోషికం 50. సినిమా బడ్జెట్ 50 అనుకున్నారట. కానీ భారీ సెట్లు అవసరం పడటంతో అనుకున్న 50 బడ్జెట్ కాస్తా 80కి వెళ్లినట్టు చెబుతున్నారు.
దీంతో బడ్జెట్ కటింగ్లకు దిగిన ఎ.ఎం. రత్నం ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించమని షరతులు విధించినట్టు తెలుస్తోంది. అయితే క్రిష్ మాత్రం ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ కావాలని, ఎలాగైనా ఈ సినిమాతో సూపర్ హిట్ని సొంతం చేసుకోవాలని ఏ విషయంలోనూ రాజీపడటం లేదట. కోహినూర్ వజ్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `విరూపాక్ష` అనే టైటిల్ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.