భారత జాతి సంపదతో పాటు మణిమకుటమైన కోహినూర్ వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని బ్రిటీష్ మూకలు మన దేశం నుంచి అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అది వారి చేతుల్లోకి ఎలా వెళ్లింది? ఎక్కడి నుంచి అది చేతులు మారుతూ చివరికి బ్రిటీష్ వారికి చేతికి చిక్కింది అన్నదాని వెనక పెద్ద కథే వుంది. ఇప్పుడు ఆ కథనే వెండితెరపై ఆవిష్కరిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వచ్చిన పవన్కల్యాణ్ తాజాగా మళ్లీ నటించడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` రీమేక్లో నటిస్తున్న పవన్ ఆ వెంటనే క్రిష్ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించాడు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం తెలంగాణ రాబిన్హుడ్ పండుగల సాయన్న కథ అని గత వారం పది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మొఘల్ సామ్రాజ్యం దేశాన్ని ఏలుతున్న కాలంలో తెలంగాణలో ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పంచిన రియల్ హీరో పండుగల సాయన్న.
అతని చేతికి కోహినూర్ వజ్రం ఎలా వచ్చింది. మొఘల్ సామ్రాజ్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి సాటి బందిపోట్ల సహాయంతో పండుగల సాయన్న కోహినూర్ వజ్రాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? ఆ తరువాత ఏం జరిగింది? మళ్లి అది ఎలా బ్రిటీష్ వారి చేతికి చిక్కింది అన్న కథాంశం చుట్టూ ఈ చిత్ర కథ సాగుతుందని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఆ కాలంలో కోహినూర్ వజ్రాన్ని అల్లా వుద్దీన్ ఖిల్జీ అపహరించాడు. అతని దగ్గరి నుంచి పండుగల సాయన్న ఎలా అపహరించాడన్నది ఇందులో ఆసక్తికరంగా క్రిష్ చూపించబోతున్నాడట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని తెలిసింది.