వెండితెరపై స్టార్ హీరోగా అభిమానుల జేజేలందుకుంటున్న స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై బిగ్బాస్ షోతో సందడి చేసిన విషయం తెలిసిందేజ సీజన్ 1 కోసం బుల్లితెరపై కొచ్చిన ఆయన తనదైన స్టైల్లో షోని రక్తికట్టించారు. హోస్ట్గా కూడా తనకు ఎదురులేదని నిరూపించారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ బుల్లితెరపై మెరవనున్నారని గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
రియాలిటీ షో బిగ్బాస్ కు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇదే తరహాలో ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ రియాలిటీ షోని ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ షో కోసం హోస్ట్గా స్టార్ హీరో ఎన్టీఆర్ ని నిర్వాహకులు సంప్రదించారట. ఇందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించనున్నందుకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని చెబుతున్నారు.
అదేంటి రెమ్యునరేషన్ లేకుండానా? అంటే ఈ షోకి ఎన్టీఆర్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారట. ఆ కారణంగానే తన ప్రొడక్షన్ కాబట్టి పారితోషికం తీసుకోవడం లేదని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.