కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణమిది. ప్రపంచాన్ని ప్రమాదంలో నెట్టేసి చైనా తన ఆధిపత్యాన్ని చెలాయించాలని, దానికి ఇదే మంచి అదను అని భావిస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలు అందుకు అద్దం పడుతున్నాయి. కరోనా విషయంలో భారత్కు తమ సహాయం వుంటుందని వెల్లడిస్తూనే చాపకింద నీరులా చైనా మన దేశంపై యుద్ధానికి కాలుదువ్వుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా తమ సైన్యాన్ని యుద్ధానికి సర్వసన్నద్దంగా వుండాలని ఆ దేశ అధ్యక్షుడు జి జిన్ పింగ్ సూచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఓ పక్క మిడతల దాటడి.. మరో పక్క కరోనా విళయతాండవంతో.. ఇబ్బందుల్లో వున్న భారత్పై యుద్ధం చేయడానికి చైనా కత్తి దూస్తోంది. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకునేందుకు సైన్యం సిద్ధంగా వుండాలని సూచించారు. పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శి, దాదాపు 20 లక్షల మిలటరీకి హెడ్ కూడా అయిన జి జిన్ పింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కు చెందిన ప్రతినిధి బృంద ప్లీనరీలో జిన్ పింగ్ యుద్ధ సన్నాహక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీజింగ్లో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. శిక్షణను మరింతగా పెంచుకోవాలని, ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానినికి సమాయాత్తం కావాలని జిన్ పింగ్ సూచించారని చైనా వార్తా సంస్థ సిన్ హువా తెలిపింది. అయితే తమ దేశం ఎవరిపై యుద్ధానికి సమాయత్తం కాబోతుందో మాత్రం వెల్లడించలేదు.