`బాహుబలి` తరువాత తెలుగు సినిమా స్థాయి పెరిగింది. అందుకు తగ్గట్టే మార్కెట్ కూడా పెరిగింది. దీంతో బడ్జెట్ పెంచడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు. తాజాగా ఓ భారీ చిత్రం కోసం విలన్ పాత్రధారికే పది కోట్లు పారితోషికం ఇవ్వడానికి మేకర్స్ సిద్ధపడటం టాలీవుడ్లో సంచలనంగా మారింది. `అల వైకుంఠపురములో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ త్వరలో మరో చిత్రానికి రెడి అవుతున్నారు.
మాటల మాంత్రికుడితో చేసిన `అల వైకుంఠపురములో` బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ని అందించడంతో మాంచి జోష్లో వున్న బన్నీ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్తో చేయబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే లొకేషన్లని ఫైనల్ చేసిన మేకర్స్ ఇందులో విలన్గా కీలక పాత్రలో విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నారు. ఇందుకు గానూ ఆయనకు పారితోషికం కింద 10 కోట్లు ఇస్తున్నారట. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో నల్లమల అడవుల్లో అత్యధిక శాతం చిత్రీకరణ జరపనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, అల్లు అర్జున్ మధ్య టెర్రిఫిక్ యాక్షన్ బ్లాక్స్ వున్నాయట. అందు కోసమే విజయ్ సేతునతికి మైత్రీవారు 10 కోట్లు రెమ్యునరేషన్ని ఆఫర్ చేసినట్లు తెలిసింది.