`బాహుబలి` చిత్రంతో రాజమౌళి ఫాదర్, రచయిత విజయేంద్ర ప్రసాద్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. రచయితల్లో ఆయన పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా తనదైన స్క్రిప్ట్లతో అలరించిన విజయేంద్ర ప్రసాద్తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్కు చెందిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా సంస్థ `ఐడియా టు స్క్రిప్ట్` పేరుతో దేశ వ్యాప్తంగా యువ రచయితల కోసం వర్క్ షాప్ని నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది.
అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా సంస్థ ఎండీ అక్కినేని అమల దీన్ని నిర్వహించబోతున్నారు. ఈ వర్క్ షాప్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరగనుంది. స్క్రిప్ట్ రైటింగ్లో ఆసక్తి వున్న యువ రచయితలంతా ఈ వర్క్ షాప్లో పాల్గొని తమ ప్రతిభని నిరూపించుకోవచ్చని. విజయేంద్ర ప్రసాద్ కలం కోట్లాది హృదయాల్ని దోచుకుందని, ప్రతీసారి బాక్సాఫీస్ విజయాల్ని అందించిందని, ఆయన అందించిన `బాహుబలి` భారతీయ చిత్ర సీమకు గొప్ప కీర్తిని, గుర్తింపును తెచ్చిపెట్టిందని ఈ సందర్భంగా అక్కినేని అమల వెల్లడించారు.
స్క్రిస్ట్ రైటింగ్లో మాస్టర్గా పేరుతెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ నుంచి ఈ వర్క్ షాప్ ద్వారా యువ ఔత్సాహిక రచయితలు మెలకువలు నేర్చుకునే వీలుంటుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
ఎంత థియేట్రికల్ నాలెడ్జ్ వున్నప్పటికీ అది ప్రాక్టికల్గా ఏమాత్రం సహకరించదని, కథలు అనేవి ఒక ఐడియాతో మొదలై చివరికి అర్థవంతమైన స్క్రిప్ట్లుగా మారతాయని, ప్రభావ వంతమైన కథని ఎలా తీర్చి దిద్దాలో, దానికి ఎలా ప్రాణం పోయాలో స్క్రిప్ట్ రైటింగ్ అర్థమయ్యేలా నేర్పిస్తుందని సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.