ఆనతి కాలంలోనే హీరోగా తనకంటూ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ, చాలా యంగ్ ఏజ్ లోనే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. కింగ్ ఆఫ్ ది హిల్స్ బ్యానర్ ను స్థాపించి మొదటి ప్రయత్నంగా మీకు మాత్రమే చెప్తా సినిమాను నిర్మించాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ భిన్నంగా జరిగినా, ప్రొడక్షన్ మాత్రం ఏ మాత్రం హడావిడి లేకుండా ముగించేశాడు విజయ్. అయితే చిత్ర రిలీజ్ కు ముందు మాత్రం బాగానే హడావిడి చేసాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి, మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేయడానికి చూసాడు. అయితే అన్నిట్లోనూ విజయ్ హైలైట్ చేసిన ఒక పాయింట్, సినిమా చూసిన తర్వాత అందరూ మాట్లాడుకుంటుండం విశేషం. ఇంతకీ అది దేని గురించంటే.. నిర్మాణ విలువల గురించి.
మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో తన ఎదుగుదలకు చాలా మంది సహాయపడ్డారని, తాను కూడా కొంత మంది ఎదుగుదలకు సహాయపడాలన్న ఉద్దేశంతో నిర్మాతగా మారానని, ఈ సినిమా ద్వారా పది మందికి లైఫ్ వచ్చినా చాలని విజయ్ ఎమోషనల్ అయ్యాడు. ఇంత వరకూ బానే ఉంది. ఈ సినిమా బడ్జెట్ గురించి చెబుతూ తాను ఇప్పటిదాకా సినిమాల ద్వారా తీసుకున్న రెమ్యునరేషన్ లో దాదాపు 70 శాతం ఈ చిత్రానికే ఖర్చుపెట్టానని, తన నాన్న కూడా మనకెందుకురా ఇప్పుడు ఇంత రిస్క్ అన్నాడని, అయినా కూడా సినిమా తీసేసానని చెప్పుకొచ్చాడు. ఈ లైన్ జనాలను బాగా ఆకర్షించింది. నిర్మాతగా తొలి సినిమా అయినా కూడా ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాడని అంతా భావించారు.
అయితే సినిమా చూసాక అందరికీ ఫ్యూజులు ఎదిగిపోయాయి. సినిమా కంటెంట్ వరకూ బాగానే ఉన్నాయి, ఇందులో నిర్మాణ విలువలు ఎక్కడ ఉన్నాయి, విజయ్ దేని గురించి ఇంతలా ఫీలైపోయి చెప్పాడు అని చర్చించుకున్నారు. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో చుట్టేయాలన్న ఇంటెన్షన్ సినిమాలో కనిపించింది. పెళ్లి సీన్ లో కనీసం కొంత మంది జనాలను కూడా చూపించకపోవడాన్ని ఏమనాలి? ఇదని కాదు చాలా సన్నివేశాల్లో నాసిరకంగా, దర్శకుడు అడిగినంత ఇవ్వకుండా సినిమా తీసిన భావం కలుగుతుంది. అలా అని సినిమా బాలేదని కాదు, యూత్ కు కనెక్ట్ అవ్వడంతో ఈ చిత్రం సఫలమైంది. తక్కువ బడ్జెట్ లో తీయడం నేరం కూడా కాదు. కానీ విజయ్ బిల్డప్ లు అంతలా ఇవ్వకుండా తక్కువ బడ్జెట్ లో తీశానని చెప్పి ఉంటే బాగుండేదని అందరూ అభిప్రాయపడుతున్నారు.