యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ గా తన ఆటిట్యూడ్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. తనతో పనిచేసే వాళ్ళ మీద ఆరోపణలు చేయడం నాగ శౌర్యకు అలవాటుగా మారుతోంది. గతంలో కణం సినిమా అప్పుడు హీరోయిన్ సాయి పల్లవి గురించి విమర్శలు చేసాడు నాగ శౌర్య. ఆమెకు ఆటిట్యూడ్ ఎక్కువని, ఇంకా చాలానే మాటలు అన్నాడు. తర్వాత అశ్వథామ సినిమా రిలీజ్ టైమ్ లో ఛలో దర్శకుడు వెంకీ కుడుములపై సంచలన వ్యాఖ్యలే చేసాడు. తను పిలిచి అవకాశమిచ్చి నిర్మాతగా కూడా మారి సినిమా చేస్తే అసలు వెంకీకి కృతజ్ఞత లేదని, తన కార్ కూడా వాడకుండా వేరే కార్ లో తిరుగుతున్నాడని, అలాంటి వాళ్ళని మళ్ళీ దగ్గరకు రానీయనని తెలిపాడు.
అయితే విమర్శలు ఎదుర్కొన్న సాయి పల్లవి, వెంకీ కుడుముల ఇద్దరూ కూడా నాగ శౌర్య విషయంలో రచ్చ చేయలేదు. విమర్శలకు స్పందించలేదు. సాయి పల్లవి అయితే నవ్వేసి ఊరుకుంది. కణం ప్రమోషన్స్ ను కూడా నాగ శౌర్య ఎగ్గొట్టినా సాయి పల్లవి ఏ మాత్రం మాట తూలలేదు. ఇప్పుడు వెంకీ కుడుముల కూడా అంతే. భీష్మ సినిమా రిలీజ్ టైమ్ లో మీడియా వాళ్ళు నాగ శౌర్య ఇష్యూపై స్పందించమని అడిగితే నవ్వేసి ఊరుకున్నాడు వెంకీ. దాని గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదంటూ సమాధానమిచ్చాడు.
రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెంకీ కుడుముల నాగ శౌర్యపై స్పందించాడు. తన గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడాడు వెంకీ. జాదూగాడు సినిమాకు తాను దర్శకత్వ శాఖలో పనిచేశానని ఆ పరిచయంతోనే నాగ శౌర్యతో ట్రావెల్ అయ్యానని, ఛలో సినిమాకు అవకాశం ఇవ్వడమే కాకుండా తానే నిర్మాతగా మారి సినిమాను నిర్మించడం నిజంగా మర్చిపోలేని సంఘటన అని నాగ శౌర్య గురించి గొప్పగా చెప్పాడు.
మనం ఒకరిపై విమర్శలు చేసినా వాళ్ళు తిరిగి పొగిడితే ఆ విమర్శలకు ఉన్న వెయిట్ తగ్గిపోతుంది కదా.