దేశ వ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా అంటే ఒకప్పుడు థియేటర్ మాత్రమే వినోదానికి ఏకైక మార్గం కానీ ఇప్పుడు థియేటర్కు వెళ్లకున్న వినోదాన్ని ఆస్వాదించవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకం మొదలైన దగ్గరి నుంచి అరచేతిలోకి వినోదం వచ్చి చేరింది. దీంతో కొత్త మార్గాల్ని సినీ జనం అన్వేషించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన మాధ్యమం డిజిటల్ సినిమా.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్.
దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణాదిలో ముందుగా తేరుకున్న ఫిల్మ్ మేకర్ అల్లు అరవింద్. ఆయన కొంత మందితో కలిసి `ఆహా` పేరుతో తొలి తెలుగు ఓటీటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో మొదలుపెట్టిన ఈ ఓటీటీ లాక్డౌన్ నుంచి మంచి ఆదరణ పొందడం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఆగస్టు నెలని బ్లాక్ బస్టర్ మంత్గా ప్రకటించిన ఆహా వరుస సినిమాలరి, రియాలిటీ షోలని స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ సందర్భంగా మీడియాలో ఇంటరాక్ట్ అయిన అల్లు అరవింద్ పలు కీలక అంశాలని వెల్లడించారు. ఫిబ్రవరి 8న `ఆహా`ని ప్రారభించామని, ఇప్పటి వరకు 40 లక్షల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. ఈ 6 నెలల కాలంలో ఆహా గురించి సెర్చ్ చేసిన వారి సంఖ్య కోటి ఇరవై లక్షలకు చేరిందన్నారు. ఏడాదిన్నర కాలంలో రీచ్ అవుదామనుకున్న టార్గెట్ని ఆరు నెలల్లోనే రీచ్ అయ్యాం అని తెలిపారు.
వచ్చే ఏడాది ఇది మూడు రెట్లు పెరిగే అవకాశం వుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా థియేటర్ అనుభూతిని మించింది లేదు. అలా అని థియేటర్లు తెరిచాక ప్రేక్షకులు ఓటీటీలని వదిలేస్తారని చెప్పలేను. థియేటర్స్ ఓపెన్ చేస్తే ఓవర్ ఫ్లో వుండదు కానీ వ్యాక్సిన్ వచ్చిన తరువాతే ఆ ఫ్లో పెరుగుతుంది. ఆగస్టు నెలలో స్వాతంత్య్ర దినోత్సవం, వినాయక చవితి పండగలు వస్తున్నాయి. దీన్ని దృష్ఠిలో పెట్టుకుని ఫెస్టివల్ నెలగా ప్రకటించాం. దసరా సందర్భంగానూ ప్రత్యేక ఫెస్టివల్ని ప్రకటిస్తాం. థియేటర్లు తెరుచుకున్నా ఓటీటీలో కంటెంట్ను కొనసాగిస్తాం. ఆహా కోసం ఇప్పటికే చాలా షోలు రెడీ చేశాం. యాంకర్ సుమతో ఆల్ ఈజ్ వెల్ షో రెడీ అయింది. నలుగురు అగ్ర దర్శకులతో భారీ షోలు ప్రారంభించబోతున్నాం. భవిష్యత్తులో ఓటీటీలు, థియేటర్లు సమాంతరంగా నడుస్తాయి. ఆహా కోసం 42 షోలు ప్లానింగ్లో వున్నాయి. సెప్టెంబర్లో ఎక్కువ శాతం షూటింగ్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రెండు మూడేళ్ల లో స్టార్స్ ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. ఆహా కోసం మెగాస్టార్తో సంప్రదింపులు జరుపుతున్నాం` అన్నారు అల్లు అరవింద్.