అకాల వర్షాల కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ సిటీలోని ప్రధాన కాలనీలన్నీజలమయమయ్యాయి. రోడ్లన్నీ వరదనీటిలో నిండిపోయి చెరువుల్ని తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద చేరడంతో చాలా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వరదలతో నష్టపోయిన వారిని ఆదుకోవడం కోసం టాలీవుడ్ స్టార్స్ ముందుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్స్టార్ మహేష్బాబు ఒక్కొక్కరు సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. వీరితో పాటు నాగార్జున 50 లక్షలు.. ఎన్టీఆర్ కూడా 50 లక్షలు ప్రకటించారు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ 10 లక్షలు.., దర్శకుడు హరీశ్శంకర్ 5 లక్షలు విరాళం ప్రకటించారు. మరి కొంత మంది స్టార్స్ కూడా విరాళం ప్రకటించే అవకాశం వుందని తెలిసింది. దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ చెరో 10 లక్షలు విరాళం అందించడానికి ముందుకొచ్చారు.
ఇదే తరహాలో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన వంత సహాయంగా సీఎం సహాయ నిధికి 5 లక్షలు ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ 15 కోట్లు విరాళం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి 10 కోట్లు ప్రకటించారు. వర్తక వాణిజ్య సంఘాలు పెద్దమనసుతో స్పందించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా సీఎం సహాయ నిధికి 10 కోట్లు విరాళం ప్రకటించింది.