ఏపీ రాజధాని అమరావతి నుంచి వైజాగ్కు మారుతున్న విషయం తెలిసిందే. అలా మార్చడానికి వీళ్లేదంటూ రాజధాని కోసం విలువైన పంట భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేసిన రైతులు గత కొన్ని రోజులుగా అమరావతి సమీపంలోని గ్రామాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. దీనికి ప్రతి పక్ష పార్టీలన్నీ మద్దతుగా నిలుస్తున్నాయి. రాజకీయ నేతలతో పాటు పలు రంగాలకు చెందిన వారంతా రాజధాని ఉద్యమానికి అండగా నిలుస్తున్నారు.
అమరావతిలో కొనసాగుతున్న రాజధాని దీక్ష తాజాగా సూపర్స్టార్ మహేష్ ఇంటికి ముందుకు చేరిందట. హైదరాబాద్ ఫిలింనగర్లో రాజధాని దీక్షకు దిగిన జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి, ఆందోళన చేపట్టారు. దీనిపై హీరోలు కూడా స్పందించాలని, లేదంటే హీరోల ఇంటి ముందు ఈ నెల 19 వరకు ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది. అమరావతి వివాదం హైదరాబాద్లో వున్న హీరోలకు పెను సవాల్గా మారింది.
హైదరాబాద్ ఫిలింనగర్లో రాజధాని దీక్షకు దిగిన జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి తాజాగా ఐదు డిమాండ్లని తెరపైకి తీసుకొచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి. వెనకబడిన రాయలసీమని అభివృద్ధి చేయాలి. కర్నూలులో హైకోర్టుని, అమరావతి, వైజాగ్లో హైకోర్టు బెంచ్లని ఏర్పాటు చేయాలి. ఏపీకి ప్రత్యేక హోదాని కల్పించాలి. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలి అని తమ ఐదు డిమాండ్లని వెల్లడించారు. దీనికి సినిమా హీరోలు, నటీనటులు అంతా సహకరించాలని లేదంటే వారింటి ముందే ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చిరించడం ఆసక్తికరంగా మారింది.