`సరిలేరు నీకెవ్వరు` ప్రీమియర్ షోల హంగామా మొదలైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ప్రీమియర్ల సందడి షురూ అయింది. మిగతా ఫ్యాన్స్తో పోలిస్తే మహేష్ ఫ్యాన్స్కి సంక్రాంతి సెలబ్రేషన్స్ ముందే మొదలవుతుండటంతో ఫ్యాన్స్ అంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. `సరిలేరు నీకెవ్వరు` ఈ నెల 11న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే మహేష్ తదుపరి సినిమా గురించి చర్చ మొదలైంది.
మహేష్తో సినిమా చేయాలని ముగ్గురు దర్శకులు ఎదురుచూస్తున్నారు. `అర్జున్రెడ్డి` ఫేమ్ సందీప్ వంగ, సుకుమార్, వంశీ పైడిపల్లి. ఈ ముగ్గురిలో మహేష్ ఎవరితో సినిమా చేస్తాడన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ముగ్గురు దర్శకుల్లో సుకుమార్ త్వరలో అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నారు. కాబట్టి ఆయన మహేష్ తదుపరి చిత్రాన్ని చేసే అవకాశం లేదు. ఇక `అర్జున్రెడ్డి` ఫేమ్ సందీప్వంగ త్వరలో ప్రభాస్తో కలిసి పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమాకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. కాబట్టి సందీప్ కూడా మహేష్తో ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేదు.
ఇక మిగిలింది వంశీ పైడిపల్లి. ఇప్పటికే మంచి లైన్ని మహేష్కి వినిపించి ఫైనల్ గా ఓకే చెప్పించుకున్నారట. ఇటీవలే ఈ విషయాన్ని వంశీ పైడిపల్లి బయట పెట్టేశాడు. తాజాగా ఆ విషయంపై మహేష్ క్లారిటీ ఇచ్చేశారు. తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితోనే వుంటుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఇందులో మహేష్ గ్యాంగ్లీడర్ తరహా పాత్రలో కనిపిస్తారట.