`టాక్సీ వాలా` సినిమాతో నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్నారు యువ నిర్మాత ఎస్కేఎన్. సాయిధరమ్తేజ్ కు హిట్ని అందించిన `ప్రతిరోజు పండగే` చిత్రానికి ఎస్కేఎన్ సహనిర్మాతగా కూడా వ్యవహరించి తన ఖాతాలో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో ముచ్చటించారు. పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండతో తాను నిర్మించిన `టాక్సీవాలా` బ్లాక్ బస్టర్ హిట్ని అందించడమే కాకుండా టెలివిజన్ ఛానల్లో టెలీకాస్ట్ అయిన ప్రతీ సారి రికార్డు స్థాయి టీఆర్పీని సొంతం చేసుకోవడం తనకు ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఈ సినిమా తరువాత సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో బన్నీవాసు నిర్మించిన మరో బ్లాక్ బస్టర్ హిట్ `ప్రతిరోజు పండగే`కు సహ నిర్మాతగా వ్యవహరించానని, ఈ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో మారుతి ఓ స్టార్ హీరోతో తెరకెక్కించనున్న చిత్రానికి సహనిర్మాతగా వ్యవహిస్తున్నానని తెలిపారు. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్కు దర్శకుడు మారుతి పర్యవేక్షణలో చేయబోతున్న వెబ్ సిరీస్కు తాను నిర్మాతగా వ్యవహరించబోతున్నానని స్పష్టం చేశారు ఎస్కేఎన్.
సాయి రాజేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నానని, వీటితో పాటు టాక్సీవాల దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ తో మరో చిత్రాన్ని చేయబోతున్నానని, అది `శ్యామ్ సింగ్రాయ్` పూర్తయిన తరువాత ఉంటుందని తెలిపారు. హీరో అల్లు శిరీష్ తదుపరి చిత్రానికి తాను కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తానని, కరోనా క్రైసిస్ ముగిసిన వెంటనే తాను పని చేస్తున్న ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అధికారిక ప్రకటనలు రాబోతున్నాయి అని అన్నారు.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీపై ఓటీటీల ప్రభావం ఎక్కువైందని వినిపిస్తున్న వాదనలపై తనదైన శైలిలో స్పందించారు. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా సినిమా ఇండస్ట్రీకి ఏమీ కాదని, జనాలు థియేటర్స్కి వెళ్లడం మానరని స్పష్టం చేశారు. రిలీజ్కు సిద్ధంగా వున్న చిత్రాల్ని ప్రేక్షకులకు చేరవేసే మాధ్యమంగా ఓటీటీలు నిర్మాతలకు కాస్త ఊరటనిస్తున్నాయని, అలా అని థియేటర్కు వెళ్లే వాళ్లు తగ్గిపోతారనడంలో అర్థం లేదన్నారు. ఎన్ని ఓటీటలు వచ్చినా థియేటర్ అనుభూతిని కొట్టేది మాత్రం ఏదీ లేదని వెల్లడించారు. మలయాళ చిత్రాల తరహాలో తెలుగులో సినిమాలు రావడం లేదన్న మాట తనని బాధించిందని చెప్పుకొచ్చారు. అతర్జాతీయ ప్రమాణాలతో బాహుబలి, అల వైకుంఠపురములో వంటి హయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాలు మన తెలుగులో నిర్మించినవే అని గుర్తు చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్రస్తుత విపత్తు నుంచి మనమంతా బయటపడే మార్గం చూపించాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు నిర్మాత ఎస్కేఎన్.