యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కు టాలీవుడ్ దర్శకుల్లో ప్రత్యేక శైలి వుంది. అది తొలి చిత్రం `పెళ్లి చూపులు`తో నిరూపించబడింది. తొలి చిత్రంతో బెస్ట్ డైలాగ్ రైటర్గా జాతీయ స్థాయిలో అవార్డుని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ యునిక్ స్టైలే ఇప్పుడు తరుణ్ భాస్కర్కు కాసులు కురిపిస్తోందట. దర్శకుడిగా `ఈ నగరానికి ఏమైంది`, నటుడిగా `నీకు మాత్రమే చెప్తా` వంటి చిత్రాల తరువాత తరుణ్ భాస్కర్ నుంచి మరో సినిమా రాలేదు.
విక్టరీ వెంకటేష్తో తన తదుపరి చిత్రాన్ని చేయాలని తరుణ్ భాస్కర్ ఎదురుచూస్తున్నారు. కరోనా వల్ల అది ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. దీంతో గత కొన్ని నెలలుగా ఖాలీగానే వుంటున్న తరుణ్ భాస్కర్కు పీవీపీ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన `ఓ మై కడవులే` చిత్రాన్ని పీవీపీ సంస్థ తెలుగులో రీమేక్ చేయబోతోంది.
విశ్వక్సేన్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ తనదైన మార్కు డైలాగ్స్ని అందిస్తున్నారట. ఇందు కోసం పీవీపీ సంస్థ తరుణ్ భాస్కర్కు భారీ మొత్తం ఆఫర్ చేసిందని, ఆఫర్ నచ్చడంతో తరుణ్ ఇప్పటికే పని మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వవరాల్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిసింది.